Friday, 8 February 2013

విపత్తు నిర్వహణ ప్రిపరేషన్ విధానం

విపత్తు నిర్వహణ
ప్రిపరేషన్ విధానం
విస్తృత అధ్యయనం అవసరం
ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లో విపత్తు నిర్వహణ (డిజాస్టర్‌ మేనేమెంట్‌) కూడా ఒక సబ్జెక్టుగా ఉంది. గత కొన్ని పరీక్షాపత్రాలను పరిశీలిస్తే దీని నుంచి సరాసరి 10-15 ప్రశ్నలు వస్తున్నాయి. మిగతా సబ్జెక్టుల మాదిరిగా ఇది కూడా ప్రాధాన్యమైనదే. దీనికి ఏ విధంగా తయారవాలో పరిశీలిద్దాం.
ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో ముందుగా సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అర్థంచేసుకోవాలి. ఏపీపీఎస్‌సీ ఇచ్చిన సిలబస్‌ కింది విధంగా ఉంది.
1) విపత్తు నిర్వహణ భావన. భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌ విపత్తుకు గురి అయ్యే అవకాశం

All The Best

2) భూకంపాలు, తుపానులు, సునామీలు, కరువులు, వరదలు- వీటికి కారణాలు, కలిగే ప్రభావాలు
3) మానవుని కారణాల వల్ల కలిగే విపత్తులు- నివారణ చర్యలు
4) విపత్తు దుష్ప్రభావాలను తగ్గించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు - చర్యలు
పై సిలబస్‌లో 4 విభాగాలు, తిరిగి వీటిలో ఉపవిభాగాలున్నాయి. మొదటి విభాగంలో విపత్తు నిర్వహణ అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్‌, భారతదేశంలో సునామీ, భూకంపం, వరదలు, కొండచరియలు విరగటం వంటివి తరచుగా ఏయే ప్రాంతాల్లో కలుగుతుంటాయి వంటివి చదవాలి.
రెండో విభాగంలో పూర్తిగా సహజ విపత్తులను గురించి ఉంది. ఇవి కలగడానికి ఒక ప్రాంత భౌగోళిక, వాతావరణ, పర్యావరణ కారకాలు, ఇవి ఆయా ప్రాంతాల్లో కలగడానికి కారణాలు గుర్తించి వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రకృతి విపత్తులు కలగడంవల్ల అక్కడి ప్రజలపై, ప్రాంతంపై కలిగే ప్రభావాలు, నష్టాలు మొదలైనవి చదవాలి. ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో ఈ విభాగంలోనే భూకంపాలు, సునామీ, తుపానులపై ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. అభ్యర్థులు దీనిని గమనించాలి.
మూడో విభాగంలో మానవ సంబంధ విపత్తుల గురించిన అంశాలున్నాయి. న్యూక్లియర్‌ ప్రమాదాలు, అణురియాక్టర్లు పేలడం, లీకేజీ, మానవుని చర్యల వల్ల కలిగే కార్చిచ్చు, రైలు, విమాన ప్రమాదాలు, భవనాలు కూలడం, గని సంబంధ ప్రమాదాల వంటివి ఈ కోవకు చెందుతాయి. ఇవి కలిగినప్పుడు తీసుకోవలసిన చర్యలు, ఇప్పటి వరకు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మానవ సంబంధి విపత్తులు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో గమనించి వాటిని ప్రత్యేకంగా చదవాలి.
నాలుగో విభాగంలో మానవ సంబంధ విపత్తులు సంభవించకుండా ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విపత్తు తరువాత ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటివి చదవాలి. ప్రకృతి సంబంధ విపత్తులను ఆధునిక సాంకేతికత ద్వారా ముందుగా తెలుసుకోవడం, వీటి గురించి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించే వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా భారతదేశం సహజ విపత్తులయిన సునామీ, వరదలు, తుపాను వంటి వాటిని గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను ఏర్పాటుచేసింది. ఇటువంటి సమాచారాన్ని సేకరించి, చదవాలి.
సంవత్సరాలు, తేదీలపై ప్రత్యేక దృష్టి
గత కొన్ని ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో విపత్తులు సంభవించిన సంవత్సరాలు, తేదీలు, చనిపోయినవారి సంఖ్య, జరిగిన నష్టం వంటి వాటిపై ప్రశ్నలు అడిగారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ప్రముఖ సహజ విపత్తుల్లో ఈ రకమైన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
1) 11-3-2012 నాటికి ఏదేశపు భూకంపం, సునామీవల్ల వేలాది మంది చనిపోయి ఒక సంవత్సరం అయింది? 
ఎ) మెక్సికో బి) ఫిలిఫ్పైన్స్‌ సి) ఇండోనేషియా డి) జపాన్‌ 
జవాబు: డి
పదేపదే అవే ప్రశ్నలు
అన్ని జనరల్‌స్టడీస్‌ పేపర్లలో విపత్తు నిర్వహణపై కొన్ని ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. ప్రతి పేపర్‌లో అడిగే 10 నుంచి 15 ప్రశ్నల్లో కనీసం 5 ప్రశ్నలు దాదాపు పాతవే. కాబట్టి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా చదవాలి. కొన్నిసార్లు ఒకే ప్రశ్న 4 నుంచి 5 సార్లు వివిధ పరీక్షల్లో అడిగారు.
ఉదాహరణకు కింది ఉదాహరణ పరిశీలిద్దాం.
1) విపత్తు నిర్వహణములో అంతర్భాగాలు 
ఎ) పునర్నివాసం బి) పునర్‌ నిర్మాణం సి) నివారణ డి) పైవన్నీ
జవాబు: డి
భారతదేశంలో విపత్తు నిర్వహణ
సిలబస్‌ అంశాలతోపాటు చదవాల్సిన మరొక టాపిక్‌- భారతదేశంలో విపత్తు నిర్వహణ. దీనిలో అంశాలైన నేషనల్‌ డిజాస్టర్‌ మేనేమెంట్‌ అథారిటీ, దీని విధులు, చేపడుతున్న చర్యలు, దీని అధ్యక్షులు, ఏర్పడిన సంవత్సరం, విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌, వరదలు, భూకంపాలపై విడుదలచేసిన పటాలు, విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే సంస్థలు అవి ఉండేచోటు, శిక్షణ కార్యక్రమాలు, జాతీయ విపత్తు నిర్వహణా చట్టం, వివిధ విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే మంత్రిత్వశాఖలు వంటివి ఎక్కువగా చదవాలి.
జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ కోణం
విపత్తు నిర్వహణలో జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ (వర్తమాన విషయాలు) కోణం కూడా ఉంది. భూకంపాలు, వరదలు, సునామీలు, వీటి ప్రభావం గురించి పూర్తిగా అర్థంచేసుకోవడానికి జాగ్రఫీ విషయ పరిజ్ఞానం కొంతవరకు అవసరం. అలాగే ఈ విపత్తుల వల్ల ఏ తీరప్రాంతాల్లో నష్టం జరుగుతున్నది, ఏయే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటి ప్రభావానికి గురి అవుతున్నాయి వంటివాటి కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటుభారతదేశ నైసర్గిక స్వరూపంపై అవగాహన అవసరం.
నదులు, వాటి జన్మస్థలం, ఇవి ప్రవహించే రాష్ట్రాలు, వీటి వరదల వల్ల ఏ ప్రాంతాలు ముంపునకు గురి అవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌, భారతదేశ పటాలు పరిశీలిస్తూ చదివితే ఉపయోగం.
ఉదాహరణ: అస్సాంలో ఎక్కువగా వరదలు ఏ నది వల్ల కలుగుతాయి? 
ఎ) గోమతి బి) గంగా సి) బ్రహ్మపుత్ర డి) యమున
జవాబు:సి
గడిచిన ఒకటి రెండు సంవత్సరాల్లో దేశంలో, ప్రపంచ వాప్తంగా ప్రముఖంగా సంభవించిన వరదలు, భూకంపాలు, సునామీలు వంటి వాటిని కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో చదవాలి. ముఖ్యంగా ఏయే ప్రాంతాల్లో, ఏయే దేశాల్లో ఇవి సంభవించాయి, వీటి తేదీలు, తుపానులకు పెట్టిన పేర్లు, కలిగిన నష్టం, ప్రకృతి విపత్తులపై ప్రముఖులు రచించిన పుస్తకాలు వంటివి కరెంట్‌ అఫైర్స్‌ అంశాలుగా పరిగణిస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
ఉదాహరణకు:ఇటీవల ప్రచురితమైన 'నేషనల్‌ హజార్డ్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌' పుస్తక రచయిత ఎవరు? (సి) 
ఎ) రంజన్‌బసు బి) కళ్యాణ్‌ చక్రవర్తి సి) సత్యేష్‌చక్రవర్తి డి) చందన్‌ సురభిదాస్‌
జవాబు: సి
పదాల అర్థాలపై ప్రశ్నలు
సునామి, డిజాస్టర్‌, మాన్‌సూన్‌ వంటి పదాలకు అర్థాలు, ఇవి ఏ భాషనుంచి వచ్చాయి అనే అంశాలను కూడా చదవాలి. గత పరీక్షల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా సునామీ, భూకంపం, వరదలకు సంబంధించిన సమాచారం అన్ని కోణాల్లో సేకరించి ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రశ్నల్లో ఎక్కువ భాగం వీటినుంచే వస్తున్నాయని గమనించాలి.

Tuesday, 29 January 2013

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో)

దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు. దీనిలో పీఓగా చేరే అవకాశం ఉద్యోగార్థులకు వచ్చింది. చిత్తశుద్ధితో దీక్షగా సిద్ధమై పోటీలో ముందుకువెళ్తే గౌరవప్రదమైన ఈ ఉద్యోగాన్ని గెలుచుకోవచ్చు!
అభ్యర్థులకు చక్కని ప్రేరణ కలిగేవిధంగా రూ. 8 లక్షలకు పైగా వార్షిక జీతం పొందే 1500 ప్రొబేషనరీ అధికారి (పీఓ) ఉద్యోగాలకు ఎస్‌బీఐ ప్రకటన జారీ చేసింది. ఉద్యోగికి 100% వైద్య ఖర్చులు, కుటుంబానికి 75% వైద్యఖర్చులు బ్యాంకే భరిస్తుంది.
ఉద్యోగ భద్రత, ఆకర్షణీయమైన జీతం స్కేలు, అతి తక్కువ వడ్డీరేట్లతో రుణ సదుపాయం, ఇతర సౌకర్యాలున్న ఈ ఎస్‌బీఐ పీఓ ఉద్యోగం ఇతర ఏ కార్పొరేటు/ సాఫ్ట్‌వేర్‌ రంగ ఉద్యోగానికి కంటే కూడా మెరుగైనదిగా పేర్కొనవచ్చు.
ప్రొబేషనరీ కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఇది ముగియగానే, ప్రొబేషనరీ కాలంలో ఉద్యోగి చూపిన ప్రతిభ ఆధారంగా స్వల్పకాలంలోనే అత్యున్నత స్థాయిని అందుకునే వీలుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థి ముందుగా బ్యాంకు వెబ్‌సైటు ద్వారా తన వివరాలు అప్‌లోడ్‌ చెయ్యాలి. తర్వాత'submit'చెయ్యాలి. అప్పుడు అభ్యర్థి వివరాలతో కూడిన 'ఫీజు చెల్లింపు చలానా' జనరేట్‌ అవుతుంది. దీన్ని ప్రింటవుట్‌ తీసుకోవాలి.
* ఏదైనా SBIబ్యాంకులో ఈ చలానా ద్వారా ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
* ఒకసారి బ్యాంకులో ఫీజు చెల్లిస్తే దరఖాస్తు చేయడం పూర్తి అయినట్లే.
* అభ్యర్థి ఫీజు చెల్లించిన మూడు రోజుల తర్వాత అభ్యర్థి దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరిస్తూ అభ్యర్థి దరఖాస్తులో ఇచ్చిన మొబైల్‌ నంబరుకు SMSవస్తుంది. అలాగే దరఖాస్తులో పేర్కొన్న ఈ-మెయిల్‌ ఐడీకి మెయిల్‌ కూడా వస్తుంది.
* తర్వాత అభ్యర్థి తను అప్‌లోడ్‌ చేసిన వివరాలు, ఫీజు చెల్లింపు వివరాలతో కూడిన దరఖాస్తును 'రీ ప్రింట్‌' తీసుకుని తనవద్ద భద్రపరుచుకోవలసి ఉంటుంది.
* ఫీజు చెల్లింపు రశీదు కూడా భద్రపరచుకోవలసి ఉంటుంది.
* ఒకవేళ అభ్యర్థి ఇంటర్వ్యూకు ఎంపిక అయినట్లయితే ఈ దరఖాస్తు ప్రింటవుట్‌, ఫీజు చెల్లింపు రశీదు ఇంటర్వ్యూ సమయంలో చూపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ప్రింటవుట్‌ను బ్యాంకుకు పోస్టు ద్వారా గానీ, మరే విధంగా గానీ పంపవలసిన పనిలేదు. అభ్యర్థి తనవద్దే భద్రపరచుకోవలసి ఉంటుంది.
* అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండి ఇంటర్వ్యూకు ఎంపిక అయితే ప్రస్తుత ఎంప్లాయర్‌ నుంచి 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికెటు' ఇంటర్వ్యూ సమయంలో దాఖలు చేయవలసి ఉంటుంది.
* అభ్యర్థి ఆబ్జెక్టివ్‌ పరీక్షలోని అన్ని విభాగాల్లో విడివిడిగా అర్హత పొందాల్సివుంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హత పొందిన (క్వాలిఫై) అభ్యర్థులకు చెందిన డిస్క్రిప్టివ్‌ పేపర్లు మాత్రమే మూల్యాంకన(Value) చేస్తారు.
* క్వాలిఫైయింగ్‌ మార్కులు క్యాటగిరీల వారీగా బ్యాంకు తదుపరి నిర్ణయిస్తుంది.
* డిస్క్రిప్టివ్‌ పేపరులో కూడా అభ్యర్థి క్వాలిఫై కావలసి ఉంటుంది.
* తుది ఎంపిక అభ్యర్థి రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌- డిస్క్రిప్టివ్‌) , గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.
* తుదిఎంపిక మొత్తం 300 మార్కులను 100కు సమానమయ్యే విధంగా లెక్కిస్తారు. రాతపరీక్షకు కేటాయించిన 250 మార్కులను 75కు సమానమయ్యే విధంగా, గ్రూప్‌ డిస్కషన్‌ ఇంటర్య్వూకు కేటాయించిన 50 మార్కులను 25కు సమానమయ్యే విధంగా లెక్కిస్తారు.
సిద్ధమయ్యే పద్ధతి
* ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష ఇంగ్లిషు విభాగం ప్రిపరేషన్‌ కోసం వ్యాకరణం (గ్రామర్‌)పై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఈ విభాగంలో గ్రామర్‌, వొకాబులరీ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలుంటాయి. ప్రతి విభాగంలో విడివిడిగా కనీస మార్కులతో క్వాలిఫై కావలసి ఉంటుంది. గ్రామర్‌, కాంప్రహెన్షన్‌లకు బాగా తయారైతే కనీస మార్కులు సులువుగా సాధించవచ్చు. వొకాబులరీ పరిధి విస్తృతమైనది కాబట్టి సాధ్యమైనంతవరకు దీన్ని పెంచుకుంటూ గ్రామర్‌, కాంప్రహెన్షన్‌లపై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుంది.
* జనరల్‌ అవేర్‌నెస్‌ సెక్షన్‌లో మార్కెటింగ్‌, కంప్యూటర్‌ నాలెడ్జిలు కూడా ఉన్నాయి.
* బ్యాంకింగ్‌, ఆర్థిక అంశాల సమకాలీన అంశాలపై 30 మార్కులు, మార్కెటింగ్‌ 10 మార్కులు, కంప్యూటర్‌ 10 మార్కులు ఉండే అవకాశం ఉంది.
* జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం ప్రతిరోజూ వార్తాపత్రికలతోపాటుగా 'బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌' వంటి బ్యాంకు పరీక్షల కోసమే రూపొందించిన మ్యాగజీన్‌ చదవాలి.
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన సమకాలీన మార్పులు, చేర్పులు, బ్యాంకుకు సంబంధించిన ప్రాథమిక అంశాల సమాచారం కూడా ముఖ్యం.
* మార్కెటింగ్‌లో ప్రస్తుతం వస్తున్న నూతన విధానాలు, టాగ్‌లైన్స్‌, పంచ్‌ లైన్లు తెలుసుకోవాలి.
* కంప్యూటర్‌ ప్రాథమిక అంశాలపై సిద్ధం కావాలి. బ్యాంకింగ్‌ నిర్వహణలో కంప్యూటర్‌ సాంకేతికత పాత్రపై ప్రశ్నలుండవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు పొందడానికి వీలున్న విభాగం ఇది.
* డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రటేషన్‌ విభాగం కోసం ప్రాథమిక అంశాలన్నింటిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. అంటే అరిథ్‌మెటిక్‌, మేథమెటికల్‌ ప్రాథమికాంశాల (బేసిక్స్‌)పై పట్టు సాధించిన తర్వాత ఇచ్చిన డేటాను విశ్లేషణ చేయడం సులువవుతుంది. ప్రాథమిక అంశాలైన శాతాలు (Percentage)సరాసరి (Average)నిష్పత్తి(Ratios),Tables, Squares,క్యూబ్స్‌ అంశాలు అభ్యర్థికి తెలియాలి. ప్రత్యక్షంగా ప్రాథమిక అంశాలపై ప్రశ్నలు ఉండకపోయినా డేటాను విశ్లేషించి ఇంటర్‌ప్రట్‌ చేయడానికి ఇవి చాలా ముఖ్యం.
* గత సం||లలో వచ్చిన బ్యాంకు పరీక్షల ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్‌లుసాధన చేయాలి. దీనివల్ల పరీక్షలో వేగాన్ని పెంచుకొని కచ్చితమైన సమాధానాలు గుర్తించగలుగుతారు.
* హైలెవల్‌ రీజనింగ్‌ విషయానికి వస్తే పూర్తిగా లాజికల్‌ రీజనింగ్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రీజనింగ్‌ విభాగం విషయంలో ముఖ్యంగా ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదవటం వల్ల సమాధానాన్ని సులువుగా గుర్తించవచ్చు.
* ఆంగ్లంలో అభ్యర్థి Written Communic ation Skillsను పరీక్షించేందుకు నిర్దేశించిన డిస్క్రిప్టివ్‌ పరీక్ష అంశాలు- కాంప్రహెన్షన్‌, Precis Writing, Letter Writing వ్యాసరచన.
* అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత పై నాలుగు అంశాలు ఉపయోగించి తన రోజువారీ ఉద్యోగ నిర్వహణ చేయవలసి ఉంటుంది. అందుకే డిస్క్రిప్టివ్‌ పేపరు తప్పనిసరిగా క్వాలిఫై కావాలనే నిబంధన.
* ఏదైనా ఒక ప్రామాణిక ఆంగ్ల గ్రామర్‌ పుస్తకం అభ్యాసం చెయ్యడం ద్వారా ఈ అంశాలకు తయారవ్వొచ్చు. ప్రతిరోజూ ఏదైనా సమకాలీన అంశం తీసుకొని కనీసం 2 వ్యాసాలు రాయడం సాధన చెయ్యాలి. అలాగే ప్రతిరోజూ ఒక ఇంగ్లిషు దినపత్రిక కేవలం జనరల్‌ అవేర్‌నెస్‌ దృష్ట్యా కాకుండా గ్రామర్‌, వొకాబులరీ, కాంప్రహెన్షన్‌, వ్యాసరచన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి కూడా ప్రిపేర్‌ కావలసి ఉంటుంది.
ఎస్‌బీఐ పీవో- ఐబీపీఎస్‌ పీవో మధ్య బేధం
* ఐబీపీఎస్‌ పీవో పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌లతో అయిదు విభాగాలుంటాయి.
* ఎస్‌బీఐ పీవోలో రీజనింగ్‌, డాటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌, ఇంగ్లిష్‌ విభాగాలతో పాటు జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్స్‌, మార్కెటింగ్‌లతో కూడిన నాలుగో విభాగముంది.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగానికి బదులుగా డాటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగముంది.
* డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కాంప్రెహెన్షన్‌, షార్ట్‌ ప్రెసి, లెటర్‌ రైటింగ్‌, వ్యాసాలతో కూడిన జనరల్‌ ఇంగ్లిష్‌పై నిర్వహిస్తారు. అభ్యర్థులు దీనిలో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
* రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)తో పాటు బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌) కూడా నిర్వహిస్తారు. అభ్యర్థులు వీటిలో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి.
డాటా అనాలిసిస్‌- ఇంటర్‌ప్రిటేషన్‌ ఎలా?
ఈ పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ బదులుగా డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగం వుంది. బ్యాంకు పరీక్షలకు సంబంధించి దీన్ని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగానే చూడాలి. దీనిలో గ్రాఫ్స్‌, చార్ట్స్‌, టేబుల్స్‌ ద్వారా సమాచారం ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
ఐబీపీఎస్‌ పీవో పరీక్షలోని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లోని 50 ప్రశ్నల్లో వీటినుంచి 20-25 ప్రశ్నలుండగా ఎస్‌బీఐ పీవోలో 45 ప్రశ్నలు డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి, 5 ప్రశ్నలు పర్‌మ్యుటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌, ప్రాబబులిటీ నుంచి ఉంటాయి. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఎస్‌బీఐ పీవో పరీక్ష ద్వారా గమనించవచ్చు.
ఈ విభాగాల్లో ఆరిథ్‌మెటిక్‌ నుంచి నేరుగా ప్రశ్నలు ఉండకపోయినా డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలు సాధించడానికి పర్సెంటేజెస్‌, ఆవరేజెస్‌, రేషియో-ప్రపోర్షన్‌, ఇంట్రెస్ట్స్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ మొదలైన అంశాలు చాలా అవసరం. అందువల్ల వీటన్నింటినీ బాగా నేర్చుకుని సాధన చేయాలి. అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు సాధించాల్సిన అవసరం లేకుండా గ్రాఫ్‌లను గమనిస్తూ జవాబులను గుర్తించవచ్చు. అయితే వీటికి సాధన చాలా అవసరం. ఒకటి కంటే ఎక్కువ గ్రాఫ్‌లను ఇచ్చినపుడు వాటి మధ్య సంబంధాన్ని గుర్తిస్తూ ప్రశ్నలు సాధించాలి.
ఇంగ్లిష్‌ భాష ప్రాముఖ్యం
రాత పరీక్షలోని ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ రెండింటిలోనూ ఇంగ్లిష్‌ లాంగ్వేజి ఉంది. అంటే రాత పరీక్షకు సంబంధించిన మొత్తం 250 మార్కులకుగాను 100 మార్కులు దీనికే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు దీనిపై దృష్టి సారించాలి. గ్రామర్‌ను నేర్చుకుని పూర్వ పరీక్షల్లోని ప్రశ్నలు సాధన చేయాలి.
ఇంగ్లిష్‌ వార్తాపత్రికలను చదవడంతో పాటు, ఏదేని విషయాన్ని తీసుకుని దానిపై దాదాపు 200 పదాల వరకు ఇంగ్లిష్‌లో రాయడం సాధన చేయాలి. విస్తృతంగా ఇచ్చిన ఏదేని విషయాన్ని చదివి అర్థంచేసుకొని దాన్ని అవసరమైనమేరకు కుదించి రాయడం అభ్యాసం చేయాలి. ఇది ప్రెసి రైటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్‌ వార్తాపత్రికలు గాని, కథలు, నవలలు గాని ఇంగ్లిష్‌లోని ఏదైనా చదివి అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఈ పరీక్షలో ఉన్న రీజనింగ్‌ హెచ్చుస్థాయిలో ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌ రీజనింగ్‌ టాపిక్స్‌తో పాటు స్టేట్‌మెంట్స్‌-అసంప్షన్స్‌, కంక్లూజన్స్‌, కోర్సెస్‌ ఆఫ్‌ ఆక్షన్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, పజిల్‌ టెస్ట్‌, ఎలిజబులిటీ టెస్ట్‌ మొదలైన వాటిని బాగా అభ్యాసం చేయాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి.
* మార్కెటింగ్‌, కంప్యూటర్స్‌కు సంబంధించిన గతంలో పీవో లేదా క్లర్క్‌ పరీక్షల్లోని ప్రశ్నపత్రాల్లో ఈ విభాగంలోని ప్రశ్నలను గమనిస్తే వాటి సరళి అర్థమవుతుంది. తద్వారా వాటికి అనుగుణంగా వీటికి సిద్ధం అవ్వొచ్చు.
* ఎకానమీ, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రుణాలకు ప్రాముఖ్యమిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను గత 5, 6 నెలల నుంచి చూసుకుంటూవుంటే జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
ఈ మధ్య జరిగిన ఏ బ్యాంకు పరీక్షలకూ లేని విధంగా ఎక్కువ సమయం (3 నెలలు) ఉందని గమనించాలి. ఈ పరీక్షకు ప్రేరణతో ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా చదివితే 'అత్యున్నత కలల ఉద్యోగం' మీ సొంతమవుతుంది!
రాతపరీక్ష తర్వాత...
బృంద చర్చ:
* అభ్యర్థి చొరవ, భావవ్యక్తీకరణ, అవగాహన సామర్థ్యం పరీక్షిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌కు విడిగా మార్కులు కేటాయించారు కాబట్టి ఈ మార్కులకు కూడా ప్రాధాన్యం.
* కేవలం బిగ్గరగా మాట్లాడటం, అసందర్భంగా మాట్లాడటం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు పదే పదే అడ్డుపడటం లాంటివి చెయ్యకూడదు.
* జరుగుతున్న సంవాదం (Discussion)కొనసాగింపుగా అభ్యర్థి తన భావవ్యక్తీకరణ చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాని పూర్తి వ్యతిరేక ధోరణిలో వితండవాదం చెయ్యడం కూడదు.
* ఉద్వేగానికి లోనుకాకుండా ప్రశాంతంగా మృదువైన భాషణతో కూడిన భావవ్యక్తీకరణకే ఎక్కువ మార్కులు ఉంటాయనే విషయం అభ్యర్థి మరువకూడదు.
మౌఖిక పరీక్ష:
* ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశ్యం అభ్యర్థి వ్యక్తిత్వ పరిశీలన. ఇంటర్వ్యూలో అభ్యర్థి తన వ్యక్తిగత సమాచారాలన్నీ ఎంత విశిష్టంగా విపులీకరించి చెప్పగలిగితే అంత ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతాడు.
* అలాగే SBIకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అభ్యర్థి ప్రిపేర్‌ కావలసి ఉంటుంది. అభ్యర్థి హాబీలు, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, క్లిష్టమైన పరిస్థితుల నిర్వహణ సామర్థ్యం మొదలైన అంశాల పరిశీలనే ధ్యేయంగా ప్రశ్నలుంటాయి.
* అభ్యర్థి ఆశావహ దృక్పథం కలిగి, మందహాసంతో సమయానుగుణంగా, చురుకుగా సమాధానాలు చెప్పడం ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఎంతో ఉపకరిస్తుంది.
పోస్టుల వివరాలు
* ఆన్‌లైన్‌లో ఈనెల 30వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 23
* రాతపరీక్ష తేదీ: 28-4-2013
ఆంధ్రప్రదేశ్‌లో రాతపరీక్ష కేంద్రాలు:
1. హైదరాబాద్‌
2. తిరుపతి
3. విజయవాడ
4. విశాఖపట్టణం
* దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే పంపాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్లు.
ఎంపిక ప్రక్రియ ఇది రెండు దశల్లో జరుగుతుంది.
మొదటి దశ: రాతపరీక్ష
రెండో దశ: బృందచర్చ, మౌఖికపరీక్ష (గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ) 
వెబ్‌సైట్: www.sbi.co.in

Monday, 14 January 2013

'జామ్‌'లో జయీభవ!


'జామ్‌'లో జయీభవ!
ఐఐటీలు సాంకేతిక విద్యతోపాటు సైన్స్‌ కోర్సులను కూడా అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నాయి. బేసిక్‌, అప్లయిడ్‌ సైన్సెస్‌లో పీజీ, పరిశోధన కోర్సులను ఐఐటీలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి నిర్వహించే జామ్‌ (జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎం.ఎస్‌సి) 2013 నోటిఫికేషన్‌ విడుదలైంది. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక సంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) కూడా జామ్‌ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తుంది. పరీక్ష స్వభావాన్ని అర్థం చేసుకొని, ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే ఈ పరీక్షలో తేలిగ్గా విజయం సాధించవచ్చు.
అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, ఆధునిక మౌలిక సౌకర్యాలు, పరిశోధనలకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ఐఐటీలు, ఐఐఎస్‌సీ ప్రత్యేకతలు. ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, పరిశోధన కోర్సులకు ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించాయి. శాస్త్రరంగానికి అవసరమైన నిపుణులను తయారుచేయడం లక్ష్యంగా అత్యున్నత ప్రమాణాలతో సైన్స్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే జామ్‌ పరీక్ష ద్వారా ఎం.ఎస్‌సి, జాయింట్‌ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ, ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయా సంస్థలు అనేక అసిస్టెంట్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఈ ఏడాది జామ్‌ నిర్వహణ బాధ్యతలను ఐఐటీ ఢిల్లీ చేపట్టింది.
జామ్‌ 2013 పరీక్షలో కింది మార్పులు చేశారు...
ఐఐఎస్‌సి, బెంగళూరు నిర్వహిస్తోన్న ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి జామ్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోనున్నారు.
బయోలాజికల్‌ సైన్సెస్‌లో నూతన పరీక్షను ప్రవేశపెట్టారు.
అమ్మాయిలకు దరఖాస్తు ఫీజు లేదు.
నాన్‌ ప్రోగామబుల్‌ కాలిక్యులేటర్‌ను పరీక్షకు అనుమతిస్తారు.
ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ (కాన్పూర్‌, ముంబయి)లలో కొన్ని ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు.
జామ్‌ పరీక్ష ద్వారా బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, రూర్కీ, భువనేశ్వర్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌, ఇండోర్‌ ఐఐటీలు సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఐఐఎస్‌సి మొదటిసారిగా ఈ ఏడాది జామ్‌ పరిధిలోకి వచ్చింది. శాస్త్రరంగంలో విశ్వవ్యాప్తంగా జరిగే పరిణామాలను, పరిశోధనలను దృష్టిలో ఉంచుకొని కోర్సులను నిరంతరం అప్‌డేట్‌ చేయడం ఈ సంస్థల విశిష్ఠత. బీఎస్సీ తర్వాత నేరుగా ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం ఐఐఎస్‌సీ ప్రత్యేకత.
జామ్‌ పరీక్ష విధానం
జామ్‌ పరీక్షలో ఈ పేపర్లు ఉంటాయి... బయోలాజికల్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌. వీటిలో బయోలాజికల్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పేపర్లు పూర్గిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. తప్పు సమాధానాలకు 1/3 శాతం నెగటివ్‌ మార్కులు ఉంటాయి.
మిగిలిన ప్రశ్నపత్రాలన్నీ ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పద్ధతుల్లో ఉంటాయి. ప్రశ్న పత్రాలతోపాటే సమాధానాలు రాయడానికి బుక్‌లెట్‌ ఇస్తారు. ఈ పేపర్లలో ప్రశ్నల విభజన ఇలా ఉంటుంది...
ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు: 20 శాతం వెయిటేజీ
ఖాళీలను పూరించడం: 30 శాతం వెయిటేజీ
డిస్క్రిప్టివ్‌ తరహా ప్రశ్నలు: 50 శాతం వెయిటేజీ
వీటిలో ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు మాత్రమే నెగటివ్‌ మార్కులు ఉంటాయి.
బయోలాజికల్‌ సైన్సెస్‌ పేపర్‌ ఎలా?
ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన బయోలాజికల్‌ సైన్సెస్‌ పేపర్‌ స్వభావాన్ని పరిశీలిద్దాం. ఈ పేపర్‌లో ర్యాంకులు, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఐఐఎస్‌సీలో ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ఇన్‌ కెమిస్ట్రీ / ఫిజిక్స్‌, ఐఐటీ బాంబేలో ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ బయోటెక్నాలజీలో ప్రవేశం లభిస్తుంది. బయాలజీ సిలబస్‌కు ప్రాధాన్యం ఉన్నప్పటికీ మేథమేటిక్స్‌ అంశాలు కూడా ఉన్నాయి. బయాలజీలో ముఖ్యంగా జనరల్‌ బయాలజీ, బేసిక్స్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ, మైక్రోబయాలజీ, సెల్‌ బయాలజీ అండ్‌ ఇమ్యునాలజీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మేథమేటికల్‌ సైన్సెస్‌లో మేథమేటికల్‌ ఫంక్షన్స్‌ (algebraic, exponential, trigonometric), their derivatives (derivatives and integrals of simple functions), permutations and combinations,తదితర అంశాలను బాగా నేర్చుకోవాలి.
ఇలా సిద్ధమైతే...
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌ సమయం చాలా తక్కువగా ఉంటుంది. సరైన ప్రణాళికను రూపొందించుకొని నిబద్ధతతో చదివితేనే మంచి ర్యాంకు తెచ్చుకోగలరు. ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ కోర్సును బాంబే, రూర్కీ ఐఐటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందువల్ల ఈ సబ్జెక్టుకు పోటీ అధికంగా ఉంటుంది. బయోటెక్నాలజీ ప్రశ్నపత్రంలో బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. బీఎస్సీ స్థాయి బయాలజీ సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి. బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌, మాలెక్యురల్‌ బయాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌లలో ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి.
కెమిస్ట్రీ పరీక్ష రాసే విద్యార్థులు ఫిజికల్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మేథ్స్‌లో పేర్కొన్న సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ; ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనెటిక్స్‌, థర్మోడైనమిక్స్‌, తదితర అంశాలను బాగా చదవాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ అంశాలను కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలి.
ఫిజిక్స్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఫిజికల్‌ ఆప్టిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అసిలేషన్స్‌, వేవ్స్‌ అండ్‌ అసిలేషన్స్‌, స్పెక్ట్రోస్కోపి, న్యూక్లియర్‌ అండ్‌ అటామిక్‌ ఫిజిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, హీట్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ సంబంధిత అంశాలను అనువర్తిత పద్ధతిలో అధ్యయనం చేయాలి.
దరఖాస్తు విధానం...
జామ్‌ 2013కు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రింటెడ్‌ దరఖాస్తులు కెనరా బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. రాష్ట్రంలోని హైదరాబాద్‌ (ఆబిడ్స్‌ రోడ్‌), కడప (చిన్నా చౌక్‌), కాకినాడ (జవహర్‌ స్ట్రీట్‌), నెల్లూరు (జొన్నగడ్డవారి వీధి), సికింద్రాబాద్‌ (ఎంజీ రోడ్‌), విజయవాడ (శివాలయం వీధి), విశాఖపట్నం (దాబా గార్డెన్స్‌) శాఖల నుంచి దరఖాస్తులు పొందవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 అక్టోబరు 2012 

జామ్‌ 2013 తేదీ: 10 ఫిబ్రవరి 2013
ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కడప, నెల్లూరు కేంద్రాల్లో పరీక్ష రాయవచ్చు.
ముఖ్యమైన సూచనలు...
ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ప్రాథమిక భావనలు, విశ్లేషణాత్మక సామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. అందువల్ల సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదవడం, వివిధ అంశాలను అన్వయించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఐఐఎస్‌సీ, ఐఐటీలు (బాంబే, కాన్పూర్‌) నిర్వహించే ఇంటర్వ్యూలో సాధారణంగా సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలనే అడుగుతారు. సబ్జెక్టును అనువర్తిత, ఆచరణాత్మక ధోరణిలో అధ్యయనం చేయడం ద్వారా ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కొనవచ్చు.
డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన అంశాలకు అధిక సమయం కేటాయించాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టి రోజూ కనీసం 5-6 గంటలు జామ్‌కు కేటాయిస్తేనే ఫలితం బావుంటుంది.
డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఇంగ్లిష్‌లో వ్యాసరూప ప్రశ్నలను రాయడం సాధన చేయాలి.
పీజీ చేయాలనుకునే విద్యార్థులు... డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చినా సరే, జామ్‌కు ప్రయత్నించడం మంచిది. అధిక సమయం కేటాయించి, సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై పట్టు పెంచుకోవాలి. సానుకూల దృక్పథంతో కష్టపడి చదివితే జామ్‌లో విజయం సాధించవచ్చు.
పాత ప్రశ్నపత్రాలు జామ్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. వీటితోపాటు సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తే పరీక్షపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. దీని ఆధారంగా డిగ్రీ సిలబస్‌, జామ్‌లో సబ్జెక్టు సిలబస్‌ మధ్య తేడాలను తెలుసుకోవచ్చు. అదనపు పాఠ్యాంశాలను గుర్తించి వాటిని చదువుకుంటే మంచి ర్యాంకు తెచ్చుకోవడం వీలవుతుంది.
జామ్‌ ప్రశ్నపత్రం, సంబంధిత కోర్సులు...
1.బయోలాజికల్‌ సైన్సెస్‌: 
ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: బయోలాజికల్‌ సైన్సెస్‌ / కెమికల్‌ సైన్సెస్‌
ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ బయోటెక్నాలజీ
2. బయోటెక్నాలజీ 
ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ఇన్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌
ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ
ఎం.ఎస్‌సి - పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ: బయోటెక్నాలజీ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
3. కెమిస్ట్రీ 
ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: కెమికల్‌ సైన్సెస్‌ / బయోలాజికల్‌ సైన్సెస్‌
జాయింట్‌ ఎం.ఎస్‌సి- పీహెచ్‌డీ ఇన్‌ కెమిస్ట్రీ
ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ
ఎం.ఎస్‌సి.- పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ: కెమిస్ట్రీ / ఎనర్జీ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ / బయోటెక్నాలజీ
4. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
5. జియాలజీ 
జాయింట్‌ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ: ఎర్త్‌ సైన్స్‌ / జియాలజీ
ఎం.ఎస్‌సి. అప్లయిడ్‌ జియాలజీ
ఎం.టెక్‌. జియోలాజికల్‌ టెక్నాలజీ
ఎం.ఎస్‌సి. -పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ అప్లయిడ్‌ జియాలజీ
6. జియోఫిజిక్స్‌ 
ఎం.ఎస్‌సి. అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌
ఎం.ఎస్‌సి. -పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌
ఎం.టెక్‌. జియోఫిజికల్‌ టెక్నాలజీ
7. మేథమేటిక్స్‌ 
ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: మేథమేటికల్‌ సైన్సెస్‌ / బయోలాజికల్‌ సైన్సెస్‌
ఎం.ఎస్‌సి. మేథమేటిక్స్‌
జాయింట్‌ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ ఇన్‌ మేథమేటిక్స్‌
ఎం.ఎస్‌సి.: మేథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ / అప్లయిడ్‌ మేథమేటిక్స్‌ / ఇండస్ట్రియల్‌ మేథమేటిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌
ఎం.ఎస్‌సి. -పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ: ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ / ఎనర్జీ
8. మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌
ఎం.ఎస్‌సి.: అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ / స్టాటిస్టిక్స్‌
ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ఇన్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌
9. ఫిజిక్స్‌
ఇంటెగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: ఫిజికల్‌ సైన్సెస్‌ / బయోలాజికల్‌ సైన్సెస్‌ / కెమికల్‌ సైన్సెస్‌
జాయింట్‌ ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ ఇన్‌ ఫిజిక్స్‌
ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌
ఎం.ఎస్‌సి. - పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ: ఫిజిక్స్‌ / ఎనర్జీ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ / బయోటెక్నాలజీ
ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌ - ఎం.టెక్‌. మెటీరియల్స్‌ సైన్సెస్‌ (నానోసైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌త
 

ఉపాధ్యాయ కొలువులకు కొత్త పరీక్ష!

TEST (Teachers' eligibility and Selection Test)

ఉపాధ్యాయ కొలువులకు కొత్త పరీక్ష!

2013లో దాదాపు పాతిక వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి/ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్‌ TEST (Teachers' eligibility and Selection Test) పేరుతో రానుంది. ఏప్రిల్‌/మేలో నిర్వహించే అవకాశమున్న ఈ నూతన పరీక్ష స్వరూప స్వభావాలు ఎలాంటివి? ఏ అంశాలకు ప్రాధాన్యం ఉండొచ్చు? సంసిద్ధత ఎలా ఉండాలి? నిపుణుల సూచనలు... ఇవిగో!
సిలబస్‌ అంశాల్లో స్పష్టత తగ్గినా పోటీ తీవ్రత దృష్ట్యా అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్‌ని ప్రారంభించటం మేలు.
జీకే, వర్తమానాంశాలు కొత్త సిలబస్‌లో ఉంటే ఇబ్బందిపడకుండా ఉండాలంటే రోజూ వార్తాపత్రికలు చదివి దేశ వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
విద్యాహక్కు చట్టం-2009 కింద దేశవ్యాప్తంగా ఏకీకృత ఉపాధ్యాయ అర్హతా పరీక్ష ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలుTET (Teachers' Eligibility Test)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాల్సివచ్చింది. మనరాష్ట్రంలో 2011లో ఒకసారి, 2012లో రెండుసార్లు టెట్‌ నిర్వహణ పూర్తయింది. అందువల్ల తదుపరి పరీక్ష 2013కి చెందినదై ఉంటుంది. ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులూ తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణులైవుండాలి. అందువల్ల ఒక అర్హతా పరీక్ష అనేది తప్పనిసరి.
అయితే ఆంధ్రప్రదేశ్‌లాంటి కొన్ని రాష్ట్రాలు DSC పేరుతో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షను నిర్వహించి ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాయి.
అటువంటి పరిస్థితిలో టెట్‌, డీఎస్‌సీ రెండు పరీక్షలనూ ఎదుర్కోవాల్సిరావటం ఉపాధ్యాయ అభ్యర్థులకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రప్రభుత్వం ఈ రెంటినీ కలిపి TESTపేరుతో ఒక నూతన పరీక్షకు తెరలేపింది.
ఈ కొత్త పరీక్షా విధానం, సిలబస్‌ ఇంకా ప్రకటించలేదు. కానీ ఇటీవలి డీఎస్‌సీలో విఫలమైన అభ్యర్థులూ, కొత్త అభ్యర్థులూ ఇప్పటినుంచీ సమాయత్తమైతేనే వాటిని ఎదుర్కోగలమనే దృష్టితో ఉన్నారు.
సిలబస్‌ ఏం ఉండొచ్చు?
విద్యాహక్కు చట్టం-2009, ప్రపంచీకరణ అవసరాల నేపథ్యంలో గతంలో జరిగిన TETపరీక్షల సిలబస్‌కి అధిక ప్రాధాన్యం ఉండవచ్చు. టెట్‌, డీఎస్‌సీలను కలుపుతున్న నేపథ్యంలో కంటెంట్‌, మెథడాలజీలు తప్పనిసరి అంశాలుగా ఉంటాయి. అయితే టెట్‌లో ఇప్పటివరకూ ఉన్న సైకాలజీ, జనరల్‌ ఇంగ్లిష్‌, అలాగే డీఎస్‌సీలో ఇప్పటివరకూ ఉన్న జీకే, విద్యాదృక్పథాలు- వీటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. ఎలాగూ టెట్‌ ప్రాధాన్యం 20 శాతం మార్కులు ఉండకపోవచ్చు కాబట్టి 4 అంశాలనూ యథాతథంగా ఉంచవచ్చా అనేది స్పష్టం కాలేదు.
ఈ సందర్భంగా వివిధ సబ్జెక్టులపై విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నఅభిప్రాయాలు:
 జీకే, వర్తమాన అంశాలను పరీక్ష కోసమే అన్నట్లు అభ్యర్థులు బట్టీ పడుతున్నారు. ఆచరణలో ఈ అంశం ఉపాధ్యాయులకు పెద్దగా ఉపయోగపడటం లేదు.
 మోడల్‌, సక్సెస్‌ పాఠశాలల నేపథ్యం, సాంకేతిక కోర్సుల అవసరం దృష్ట్యా జనరల్‌ ఇంగ్లిష్‌ తప్పనిసరిగా ఉండాలి.
 విద్యార్థి అధ్యయనానికి సైకాలజీ ఉండవలసిందే.
 ఉపాధ్యాయుని దృక్పథాన్ని తీర్చిదిద్దేది కాబట్టి 'విద్యాదృక్పథాలు'నుకొనసాగించవచ్చు.
4 అంశాలనూ కొనసాగిస్తే Jack of all trades and master of none' సామెత రుజువయ్యే ప్రమాదం ఉంది. టెట్‌లో మాదిరిగా ఎస్‌జీటీలకు 9,10 తరగతుల సిలబస్‌; స్కూల్‌ అసిస్టెంట్లకు ఇంటర్‌ సిలబస్‌ ఉంచుతారా లేదా అన్నది మరొక విషయం.
సిలబస్‌ అంశాల్లో స్పష్టత తగ్గినా పోటీ తీవ్రత దృష్ట్యా అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్‌ని ప్రారంభించటం మేలు.
ఎస్‌జీటీ అభ్యర్థులు
 1 నుంచి 8 తరగతుల సిలబస్‌ని క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా 6,7.8 తరగతుల్లోని గణితం, భౌతికశాస్త్రం అంశాల విషయంలో ఆర్ట్స్‌ అభ్యర్థులు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు.
 అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వారు ఇంగ్లిష్‌ భాషలో నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయాలి. అరమార్కుతో కూడా విజయావకాశాలు దూరమయ్యే పరిస్థితి ఉన్నందువల్ల ఇంగ్లిష్‌లో సరైన పట్టు సాధించటం అవసరం.
 మాతృభాష అయినా తెలుగులో అభ్యర్థులు ఆశించినస్థాయిలో ప్రతిభను చూపలేకపోతున్నారు. ఈ లోపాన్ని సవరించుకోవటానికి ఇదే సరైన సమయం.
స్కూల్‌ అసిస్టెంట్లు /భాషాపండితులు
6-10 తరగతుల సిలబస్‌పై పట్టు కోసం ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా గణితం/ఫిజికల్‌ సైన్స్‌ అభ్యర్థులు గత అనుభవాలను బట్టి ప్రశ్నల క్లిష్టతను ఎదుర్కొనేలా తయారయ్యేందుకు అనువైన సమయమిదే. ఆర్ట్స్‌ అభ్యర్థులు జాగ్రఫీ, చరిత్రలాంటి పాఠ్యాంశాల్లో సిలబస్‌ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఈ సమయాన్ని అందుకోసం వెచ్చించాలి.
సూచన: మెథడాలజీ విషయంలో ఎస్‌జీటీ/ ఎస్‌ఏలు నామమాత్రంగానే స్కోరు సాధిస్తున్నారు. అందువల్ల మంచి ర్యాంకు సాధించాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు సమయం కేటాయించుకుని మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఈ దశలో సిలబస్‌లోని పాఠ్యాంశాలు కొన్నిటిని కాకుండా అన్నిటినీ చదవాలి. కీలకమైన పాఠాలనుంచే కాకుండా ఇతర పాఠాలనుంచి కూడా ఐదారు ప్రశ్నలు అడుగుతున్నారు.
పి.ఇ.టి.లు
దాదాపు 4,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దాదాపుగా పీఈటీ అభ్యర్థులు అందరికీ ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశం.
నోటిఫికేషన్‌ వచ్చేముందుగా ఆర్గనైజేషన్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైకాలజీ, మెటీరియల్‌ అండ్‌ మెథడ్స్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, అనాటమీ, ఫిజియాలజీ లాంటి అంశాలకు తగిన సమయం వెచ్చించేందుకు ఇది తరుణం. ముఖ్యంగా పి.ఇ.టి. అభ్యర్థుల్లో థియరీ అంశాల్లో ఆశించిన స్థాయి ఉండటం లేదు. అందుకని ఈ సమయాన్ని అందుకు వినియోగిస్తే పోటీలో ముందుండవచ్చు.
ఇతర అంశాలు
 సైకాలజీ లాంటి అంశాలకు రాబోయే నూతన విధానంలో ప్రాధాన్యం ఉండొచ్చు. అందువల్ల కంటెంట్‌, మెథడాలజీలపై పట్టు సాధించి ఉంటే సైకాలజీకి సమయం కేటాయించటానికి వీలవుతుంది.
 జీకే, వర్తమానాంశాలు కొత్త సిలబస్‌లో ఉంటే ఇబ్బందిపడకుండా ఉండాలంటే రోజూ వార్తాపత్రికలు చదివి దేశ వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 ఇప్పటికే డీఎస్‌సీ రాసిన అభ్యర్థులు విజయం సాధించలేకపోయివుంటే లోపం ఎక్కడుందో గమనించండి. ముఖ్యంగా మెథడాలజీ లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్‌ని కొనసాగించవచ్చు. 'నోటిఫికేషన్‌ వచ్చాక చూద్దాం' లాంటి ధోరణి వద్దు. ఇప్పటినుంచే మళ్ళీ సన్నద్ధత మొదలుపెట్టండి.
 కోచింగ్‌ సంస్థల, మార్కెట్లో దొరికే మెటీరియల్‌లో అనవసర సమాచారం ఎక్కువుంటుంది. అందుకని సైకాలజీ, మెథడాలజీ లాంటివాటికి తెలుగు అకాడమీ పుస్తకాలు సరిగా ప్రిపేరవ్వాలి. కంటెంట్‌ కోసం పాఠశాలస్థాయి పాఠ్యపుస్తకాలు చాలు. గతంలో ఈ విధంగా సిద్ధం కాకపోతే ఈ సమయం అందుకు అనుకూలమని కార్యాచరణ మొదలుపెట్టాలి.
 ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా అర్హత పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్‌ లేదు కాబట్టి ఏం చేయాలనే సందేహం పెట్టుకోవద్దు. TESTద్వారా ఆ అవకాశం కల్పించవచ్చు. అందువల్ల మీ పాఠశాలలో మీరు కొనసాగాలంటే తప్పనిసరిగా ప్రిపరేషన్‌ని ప్రారంభించాలి.
వేటిపై దృష్టి సారించాలి?
టెట్‌, డీఎస్‌సీలలో దాదాపు ఒకే సిలబస్‌ ఉండటం, టెట్‌లో అభ్యసించిన విషయాలనే చాలావరకూ డీఎస్‌సీలో మళ్ళీ చదవాల్సిరావటంతో అభ్యర్థుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పరీక్షలకు బదులు ఒకే TESTనిర్వహించనుండటం ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు శుభపరిణామమే. కాలం, శ్రమ, ఖర్చు తగ్గుతాయి. కాలయాపన లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
 TEST లో ఎక్కువభాగం టెట్‌ సిలబస్‌ ఉండటానికి అవకాశముంది.
 పెడగాజి (మెథడాలజీల)పై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఒక్క బోధనాపద్ధతుల సిలబస్‌ను ఆమూలాగ్రం విశ్లేషణాత్మకంగా అభ్యసిస్తే అది మిగతా బోధనాపద్ధతుల అభ్యాసంలో, సులభంగా నేర్చుకోవడంలో తోడ్పడుతుంది.
 కంటెంట్‌పై శ్రద్ధ వహించాలి. దీన్ని అభ్యసించేటపుడు మెథడాలజీని కూడా అన్వయించుకుంటే మంచి ఫలితాలకు వీలుంటుంది.
 సైకాలజీ, మెథడాలజీలను పాఠశాల స్థాయిలో చదవలేదు కాబట్టి వీటిపై శ్రద్ధపెట్టాలి.
 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని తరగతి గది విషయాలకు అన్వయించుకుని సన్నద్ధత కొనసాగించాలి. ఈ సైకాలజీ కష్టమనే భావన నుంచి అభ్యర్థులు బయటపడటానికి అర్థం చేసుకుంటూ చాలాసార్లు అభ్యసించటమే మార్గం.
 విద్యారంగంలోని దృక్పథాలు, వర్తమాన అంశాలపై పట్టు సాధించటం అవసరం.
 ఎస్‌జీటీకి సిద్ధమయ్యేవారు తెలుగు, ఆంగ్ల వ్యాకరణాంశాలను ఇప్పటినుంచే టెన్త్‌ స్థాయివరకూ నేర్చుకోవాలి.
మంచి మార్కులు పొందాలంటే...
 ఇప్పటికే టెట్‌, డీఎస్‌సీ రాసినవారు ఏ సబ్జెక్టులో ఇంకా సాధన అవసరమనిపిస్తుందో దానిపై దృష్టిపెట్టాలి.
 ఇటీవలే డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైనవారు ఇంతవరకూ చదివిన విషయాలను ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల్లోకి మార్చుకుని అభ్యసించాలి.
 నిర్దేశిత సిలబస్‌ ప్రకారం ప్రామాణిక పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.
 కేవలం జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాసే స్థితిలో ఉండకూడదు. అవగాహన, అనుప్రయుక్త, విశ్లేషణ, తార్కిక పద్ధతిలోని ప్రశ్నలకు సమాధానం రాసేలా తయారవ్వాలి.

Thursday, 10 January 2013

EAMCET - 2013 PREPARATION PLAN

EAMCET - 2013 PREPARATION PLAN
ఎంసెట్‌ వ్యూహం!
పేరున్న కళాశాలలో, ఇష్టమైన బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చదవాలి. నాలుగేళ్ళూ కష్టపడి చదివితే ఇక భవితకు తిరుగే ఉండదు!... ఎంపీసీ విద్యార్థుల అంతరంగమిది. దీనికి పునాది ఎంసెట్‌లో మంచి ర్యాంకు. దీన్ని సాధించటానికి పటిష్ఠంగా వ్యూహం రూపొందించుకోవాలి కదా! అదెలాగో- చదవండి...
మనరాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులకు ఇంటర్‌ విద్య అంటే ఎంపీసీ లేదా బైపీసీ. వీరిలోనూ ఎక్కువమంది ఇంజినీరింగ్‌వైపు అంటే ఎంపీసీకే మొగ్గు చూపుతున్నారు. సీనియర్‌ ఇంటర్మీడియట్లో దాదాపు 9 లక్షలమంది విద్యార్థులుంటే వారిలో దాదాపు 4 లక్షలమంది ఎంపీసీ విద్యార్థులే! వీరిలో ఒక శాతం విద్యార్థులు ఐఐటీలకూ, ఒకశాతం విద్యార్థులు ఎన్‌ఐటీలకూ వెళ్తున్నారు. బీఎస్‌సీ కోర్సువైపు వెళ్ళేవారిని మినహాయిస్తే అత్యధిక శాతం విద్యార్థులు ఎంసెట్‌ ఆధారంగా ప్రవేశాలు జరిపే ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనో, స్వయంప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లోనో చేరటానికి ఇష్టపడుతున్నారు.
ఇంజినీరింగ్‌ ఆశావహులకు మనరాష్ట్రంలో అవసరానికి మించిన సంఖ్యలో సీట్లున్నాయి. కానీ ఇంజినీర్లుగా ఉజ్వల భవిత పొందాలంటే తొలి 5 శాతం ఎంసెట్‌ ర్యాంకర్లలో ఒకరుగా ఉండాల్సిందే. అప్పుడే ఆశించిన ఇంజినీరింగ్‌ కళాశాలలో, కోరుకున్న బ్రాంచిలో చేరే అవకాశం ఉంటుంది.
అందుకే ఇంజినీరింగ్‌ చేయాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయ కళాశాలల్లో లేదా ప్రసిద్ధ (టాప్‌ 20) ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సాధించే ర్యాంకు తెచ్చుకోవాలి. ఎంసెట్‌ ప్రణాళికను ఆ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించుకోవాలి.
ర్యాంకును ఎలా నిర్థారిస్తారు?
ఎంసెట్‌లో విద్యార్థి సాధించిన మార్కులకు 75 శాతం, ఇంటర్‌ గ్రూప్‌ సబ్జెక్టుల్లో తెచ్చుకున్న మార్కులకు 25 శాతం వెయిటేజి ఇచ్చి ఎంసెట్‌ తుది ర్యాంకును నిర్థారిస్తారు. ఇక్కడ ఇంటర్మీడియట్‌ మార్కులంటే- ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మొత్తం మార్కులు 1000 కాదు. వాటిలో లాంగ్వేజెస్‌ మార్కులు 400 మార్కులను తీసేయగా మిగిలిన 600 మార్కులకు విద్యార్థి ఎన్ని సాధిస్తాడో వాటిని 25కు కుదిస్తారు. అంటే ఇంటర్లో విద్యార్థి సాధించిన ప్రతి 24 మార్కులకూ ఎంసెట్‌ తుది ర్యాంకులో ఒక మార్కు వెయిటేజి పెరుగుతుంది.
ఈ విశ్లేషణ చూడండి
గత ఏడాది తొలి 20 వేలమంది విద్యార్థుల మార్కులు గమనిస్తే... వారి మార్కుల్లో గరిష్ఠ వ్యత్యాసం 50 వరకూ ఉంది. అంటే ఇంటర్లో గ్రూప్‌ సబ్జెక్టుల్లో 600 మార్కులకు 550పైన సాధించిన విద్యార్థులే ఉన్నారు. కాబట్టి ఎంసెట్‌ తుది ర్యాంకులో ఏర్పడే మార్కుల తేడా కేవలం రెండు మార్కులు మాత్రమే!
ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజి ఉన్నప్పటికీ తుది ర్యాంకు నిర్థారణ కేవలం విద్యార్థి ఎంసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉంటుంది.
ఇంకొక విధంగా విశ్లేషిస్తే...
ఇంటర్‌ గ్రూప్‌ సబ్జెక్టుల్లో ఒక మార్కు వ్యత్యాసం ఉంటే తుది ర్యాంకు నిర్థారణకు తీసుకునే ఇంటర్‌ వెయిటేజిలో మార్పు 0.04167 మాత్రమే! ఈ ఇంటర్‌ మార్కుల వల్ల ఒకే మార్కు వచ్చిన విద్యార్థులకు తుది ర్యాంకు నిర్థారణ అంటే 10 నుంచి 50 లోపు ర్యాంకులు మాత్రమే మారే అవకాశముంది. అంతేగానీ ఏ విద్యార్థి కూడా కేవలం ఇంటర్‌ మార్కుల ఆధారంగా మంచి ర్యాంకు సాధించే అవకాశం లేదు!
ఇంటర్‌ Vs ఎంసెట్‌
ఎంసెట్‌ 160 మార్కులకు జరిగితే దానిలో విద్యార్థి సాధించిన మార్కులను 75కి కుదిస్తారు కదా? అంటే ఎంసెట్‌లో విద్యార్థి పొందే ప్రతి రెండు మార్కులకూ సమారుగా తుది వెయిటేజిలో ఒక మార్కు పెరుగుతుంది. లేదా ఎంసెట్‌లో విద్యార్థి పొందే ఒక మార్కుకు అతని తుది ఎంసెట్‌ ర్యాంకు నిర్థారణలో వెయిటేజి 0.46875 పెరుగుతుంది.
ఇంటర్‌ మార్కులూ ఎంసెట్‌ మార్కులను పోలిస్తే... ఇంటర్‌లో సాధించిన 14 మార్కులు ఎంసెట్‌లో సాధించే ఒక మార్కుతో సమానం! దీన్నిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... ఇంటర్‌ మార్కులకంటే ఎంసెట్‌లో అధిక మార్కుల సాధనకే ప్రాధాన్యం ఇవ్వాలి!
వెయ్యిలోపు ర్యాంకు రావాలంటే...
ఎంసెట్‌ (మొత్తం 160 మార్కులు) లో గత సంవత్సరం ఏ మార్కు సాధిస్తే ఏ ర్యాంకు వచ్చిందో పరిశీలిద్దాం.
 140 మార్కులపైన సాధిస్తే 50లోపు ర్యాంకు
 136 పైన సాధిస్తే 100 లోపు ర్యాంకు
 120 మార్కులపైన సాధిస్తే 500లోపు ర్యాంకు
 110 మార్కులపైన సాధిస్తే 1000లోపు ర్యాంకు
 90 మార్కులపైన సాధిస్తే 5000లోపు ర్యాంకు
ఈ విశ్లేషణను పరిశీలిస్తే... ఎంసెట్‌లో 110 నుంచి 120 మార్కులు తెచ్చుకోగలిగితే కచ్చితంగా 1000లోపు ర్యాంకు వస్తుందని తెలిసిపోతోంది కదా? ప్రణాళికాబద్ధంగా తయారైతే ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ సీటు సాధించటం అంత కష్టమేమీ కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది.
మార్కులకు మెలకువలు
ఇంటర్‌లో సాధించిన 14 మార్కులు ఎంసెట్‌లో సాధించే ఒక మార్కుతో సమానం! ఇంటర్‌ మార్కులు గరిష్ఠంగా తెచ్చుకోవాల్సిందే కానీ- ఆ మార్కుల కంటే ఎంసెట్‌లో అధిక మార్కుల సాధనకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మంచి ర్యాంకు వస్తుంది!
ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పాఠ్యాంశాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఉండే 80 లెక్కల ప్రశ్నల్లో దాదాపు 40 ప్రథమ సంవత్సరం నుంచి వస్తాయి. భౌతికశాస్త్రంలోని 40 ప్రశ్నల్లో దాదాపు 20; రసాయనశాస్త్రంలోని 40 ప్రశ్నల్లో దాదాపు 20 ప్రశ్నలు ప్రథమ సంవత్సర సిలబస్‌ నుంచే వస్తాయి.
ఎంసెట్‌ తయారీలో ఫలానా పాఠ్యాంశాలకు ప్రాధాన్యం, ఫలానావాటికి ప్రాధాన్యం లేదు- అంటూ ఏమీ లేదు. అన్నిటికీ సమ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. అయితే సులువుగా, తక్కువ పరిమాణంలో ఉన్న అధ్యాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం తెలివైన పని.
ఉదాహరణకు- భౌతికశాస్త్రంలో 1) శుద్ధ గతికశాస్త్రం నుంచి ఒక ప్రశ్న వస్తుంది 2) ప్రమాణాలు-మితులు నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. కానీ రెండోది చాలా చిన్న అధ్యాయం. తప్పులు చేసే అవకాశాలు కూడా తక్కువ. కాబట్టి ఇటువంటి అధ్యాయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
అనుకూలంగా మల్చుకుని...
ఎంసెట్‌లో పాసవడానికి ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులుండాలనే నిబంధన లేదు. అందుకే విద్యార్థులు తమకు పట్టు ఉన్న సబ్జెక్టులో ఎక్కువ పొంది, వేరొకదానిలో తక్కువ మార్కులు వచ్చినా వెయ్యిలోపు ర్యాంకు పొందొచ్చు.
అధికశాతం ఎంపీసీ విద్యార్థులు లెక్కలు బాగానే చేస్తారు కదా? దానిలో 80 మార్కులకు 70 మార్కులపైన సాధించి, కెమిస్ట్రీలో 40 మార్కులకు 30 మార్కులు సాధిస్తే.. ఫిజిక్స్‌లో 10-15 మార్కులు సాధించినప్పటికీ 1000 లోపు ర్యాంకు సాధ్యమే!
పరీక్ష రాసేటప్పుడు సమయపు ఒత్తిడికి లోనుకాకుండా పట్టు ఉన్న సబ్జెక్టుతోనే పరీక్ష ప్రారంభించడం మేలు. జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ప్రశ్నల సంఖ్య తక్కువ కాబట్టి ఒత్తిడి ఉండదు. ఎంసెట్‌లో ఎక్కువ ప్రశ్నల వల్ల ఈ సమస్య ఉంటుంది. అందుకని ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివర్లో ప్రయత్నించాలి కానీ, పరీక్ష ప్రారంభంలో వాటికి సమయం కేటాయించకూడదు.
ఎంసెట్‌లో రుణాత్మక (మైనస్‌) మార్కులు లేవు. తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించకుండా వదిలివేయనక్కర్లేదు. జవాబులు తెలియని అన్ని ప్రశ్నలకూ ఒకే జవాబు గుర్తిస్తే... ఎక్కువ ప్రశ్నలు కరెక్టయ్యే సంభావ్యత ఏర్పడుతుంది.
ఇప్పటినుంచి చదివినా...
ఎంసెట్‌కు సుమారు నాలుగు నెలల వ్యవధి ఉంది. ఇప్పటినుంచి ప్రణాళికతో చదివినా మంచి ర్యాంకు సాధించవచ్చు.
 మార్చి 19 (ఇంటర్‌ పరీక్షల) వరకూ సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌కు పరిమితమవ్వాలి. ఇంటర్‌ అకాడమీ పుస్తకాలతో పాటు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను కూడా సాధన చేస్తుంటే ఎంసెట్‌తో పాటు ఇంటర్లో ఉండే 2 మార్కుల ప్రశ్నలకూ ఉపయోగం.

 మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 7 వరకూ జేఈఈ మెయిన్స్‌కు కొంత అభ్యాసం చేసి, తర్వాత జూనియర్‌ ఇంటర్‌కు 20 రోజుల ప్రాధాన్యం ఇచ్చి చదివితే సరిపోతుంది.
ఇలా తయారు కాగలిగితే ఎంసెట్‌తో పాటు బిట్‌శాట్‌ లాంటి పరీక్షలు కూడా బాగా రాయవచ్చు.
ఎంసెట్‌లో అకాడమీ పుస్తకాల పరిధి దాటి బయట ఒక ప్రశ్న కూడా ఇవ్వటం లేదు. అందుకని అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమై వాటిని పునశ్చరణ (రివిజన్‌) చేయటం మేలు.
ప్రశ్నల సంఖ్య అధికం కాబట్టి ఎక్కువ నమూనా పరీక్షలు అభ్యాసం చేయాలి. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభించినా సరిపోతుంది.
ఒక అభ్యాసానికి పరిమితమై పరీక్షలు రాసేకంటే మొత్తం సిలబస్‌లో ఎక్కువ గ్రాండ్‌ టెస్టులు రాయటం ఎక్కువ లాభదాయకం. పరీక్ష హాల్లో లెక్కలు 1.15 గంటలు, కెమిస్ట్రీ 45 నిమిషాలు, ఫిజిక్స్‌ 1 గంట మించి చేయకూడదు. ఇది గరిష్ఠ అవధిగా తీసుకుని అభ్యాసం చేయాలి.
కెమిస్ట్రీలో గ్రూపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిని పోల్చడానికి వీలుగా పట్టికలు (టేబుల్స్‌) తయారుచేసుకుని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. సెకండియర్‌ ఫిజిక్స్‌లో సర్క్యూట్‌ డయాగ్రమ్‌ ఉన్న ప్రశ్నలు ఎంసెట్‌లో ఇవ్వటం లేదు. అందుకని ఆ లెక్కలు చేయడానికి సమయాన్ని వృథా చేసుకోవద్దు.
ఈ అంశాలన్నిటిపై దృష్టి పెట్టి సన్నద్ధత కొనసాగిస్తే ఎంసెట్‌లో మీకు ఎదురులేనట్లే!

Monday, 7 January 2013

Police Constable Preparation Plan

Police Constable Preparation Plan

పోలీసు కొలువుకు సిద్ధమేనా?

రాష్ట్ర పోలీసుశాఖలో 6071 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వోద్యోగం పొందే చక్కని అవకాశమిది. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, ఎస్‌ఐలుగా ఎదిగే అవకాశాలుంటాయి. ఆసక్తి, అర్హతలున్నవారు పట్టుదలతో కష్టపడి ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు!
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తొలిదశ అయిన శారీరక పరీక్షల్లో నెగ్గాలి. ఆపై రెండోదశ అయిన రాత పరీక్షలో కూడా ప్రతిభ చూపించగలిగితే కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపికవుతారు. ఇవి జిల్లాస్థాయి పోస్టులు. రాష్ట్రంలోని ఒక్కోజిల్లాలో ఈ పోస్టుల సంఖ్య ఒక్కో రకంగా ఉంది. పూర్తి వివరాలకు www.apstatepolice.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎన్ని ఖాళీలు? 
(i) పురుషులకు: 3228 (అన్నీ కలిపి)
(ii) స్త్రీలకు: సివిల్‌: 2749; ఎ.ఆర్‌.: 94
 విద్యార్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత/ దీనికి సమానమైన అర్హత
 వయసు: 1 జులై 2012 నాటికి 18 సంవత్సరాలు నిండి 22 సంవత్సరాలు దాటకూడదు.
 దరఖాస్తు గడువు: 21-01-13 నుంచి 20-02-13 వరకూ
 దరఖాస్తులను అభ్యర్థి స్వయంగా జిల్లా పోలీస్‌ కార్యాలయాలు/ పోలీస్‌ కమిషనరేట్స్‌లో దాఖలు చేయవచ్చు.
శారీరక ప్రమాణాలు
 పురుష అభ్యర్థులకు- 
ఎత్తు: 167.6 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఛాతీ: 86.3 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి.
 స్త్రీ అభ్యర్థులకు-
ఎత్తు: 152.5 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. బరువు: 40 కేజీల కంటే తక్కువ ఉండకూడదు.
అభ్యర్థి నిర్ణీత సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోకుండా వారం రోజులపాటు 15 నిమిషాలు, తర్వాత వారంరోజులు 20 నిమిషాలు, ఆపై వారం 20 నుంచి 30 నిమిషాలు ఆగకుండా పరుగెత్తడం సాధన చేస్తే శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది.
ఈ విభాగంలో ప్రైమరీ క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ (PQT), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (PET)అనే రెండు దశలుంటాయి. వీటిలో కీలకం PQT. ఎందుకంటే దీనిలో అర్హత సాధించిన తర్వాత మాత్రమే రెండో దశకు అనుమతి లభిస్తుంది.
ప్రైమరీ క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌లో నిర్దేశించిన దూరాన్ని నిర్ణీతకాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ క్రమంలో పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 25 ని||ల్లో, మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ. దూరాన్ని 16 ని||ల్లో చేరుకోవాలి.
చేయవలసినవి
 అభ్యర్థులు ఉదయం, సాయంత్రం సాధనకు కొంత సమయం కేటాయించాలి.
 సాధన సమయంలో స్పోర్ట్స్‌ షూ ధరించడం సౌకర్యం.
 పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పండ్ల రసాలు, మాంసం తీసుకోవాలి.
 ప్రతిరోజు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి.
 పరుగు, ఈవెంట్స్‌ ముందు శరీరాన్ని warmup చేసుకోవాలి.
 5 కి.మీ. పరుగు పూర్తయిన తర్వాత ముక్కుతో గాలి ఎక్కువగా తీసుకుంటూ నోటితో వదిలేస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండాలి.
చేయకూడనివి
 పరిగెత్తేటపుడు చేతులు, కాళ్ళు బిగించరాదు.
 5 కి.మీ. పరుగు తర్వాత పడుకోవడం, కూర్చోవడం లాంటివి చేయకూడదు.
 పరుగు మొదలైన తర్వాత ఒకేసారి వేగంగా పరుగెత్తకూడదు.
 పరుగెత్తేపుడు నోటిలో గుడ్డలు, నిమ్మకాయలు లాంటివి పెట్టుకోకూడదు.
 మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
రాత పరీక్షలో విభాగాలు
1) ఇంగ్లిష్‌
2) అరిథ్‌మేటిక్‌
3) జనరల్‌ సైన్స్‌
4) భారతదేశ చరిత్ర
5) భారతదేశ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు
6) జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు
7) రీజనింగ్‌
వీటిలో మొదటి రెండింటి గురించి చూద్దాం
ఇంగ్లిష్‌: కానిస్టేబుల్‌ పరీక్ష రాసే అభ్యర్ధుల్లో ఎక్కువశాతం గ్రామీణ విద్యార్ధులే. వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఆంగ్లం క్లిష్టమనే భావన మనసులో పాతుకుని ఉంటుంది. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ విభాగం నుండి 10- 20 ప్రశ్నలు రావచ్చు. అర్థం చేసుకుంటూ సాధన చేయాలి. ఇంటర్‌స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. వ్యాకరణాంశాలు అన్నింటిపైనా అభ్యాసం అవసరం.
అరిథ్‌మేటిక్‌: ఈ విభాగం నుంచి 25- 40 ప్రశ్నలు రావచ్చు. దీనిలోని ప్రశ్నలు అభ్యర్థులు చదివిన ప్రాథమిక స్థాయిలోని గణిత సామర్థాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఇందులో రాణించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలపై పట్టు ఉండాలి. భాగస్వామ్యం, లాభనష్టాలు, శాతాలలో చాలారకాల ప్రశ్నలు ఉంటాయి. వీటిని సాధన చేస్తే తర్వాతి విభాగాల్లో ప్రశ్నలు చేయడం సులువు.
కాలం-దూరం, రైళ్ళలో కూడా దాదాపు అన్ని ప్రశ్నలూ ఒకేలా ఉంటాయి. సంభావ్యత, క్యాలెండర్‌, గడియారాలు మొదలైన అంశాలనుంచి తప్పక ప్రశ్నలు వస్తాయి. బారువడ్డీ, చక్రవడ్డీ సూత్రాలపై ప్రశ్నలు అడగవచ్చు. సంఖ్యల్లో చిన్న, పెద్ద, వాటి మధ్య వ్యత్యాసం, లబ్ధంపై ఎక్కువ సాధన చేయాలి.
త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్‌, వృత్తం మొదలైనవాటి ఫార్ములాలు తప్పక నేర్చుకోవాలి. వీటివల్ల ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఘనపరిమాణాల్లో ఘనం, గోళం, స్థూపం మొదలైనవి నేర్చుకుంటే మంచిది. పాత ప్రశ్నపత్రాలను చూసి వాటి కంటే కొంచెం ఎక్కువస్థాయి సాధన చేసుకోవటం ఉత్తమం.
5 కి.మీ. పరుగు ఎలా?
పరుగెత్తేటపుడు స్పోర్ట్‌ షూ, పలుచని కాటన్‌ సాక్స్‌ ధరించాలి. షూ లేకుండా పరుగెత్తేవారు కాలివేళ్ళకు కాటన్‌ ప్లాస్టర్‌ చుట్టుకోవాలి. వదులయిన కాటన్‌ దుస్తులు ధరించాలి. 5 కి.మీ. పరుగు పందెం కోసం ప్రతిరోజూ కనీసం 2.5-4 కి.మీ. దూరం పరుగెత్తాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి సమయంతో నిమిత్తం లేకుండా సాధన చేయాలి. ఇలా చేస్తే శ్వాసపై నియంత్రణ వస్తుంది.
వారానికి ఒకసారి 5 కి.మీ. దూరాన్ని లక్ష్యంగా చేసుకొని పరుగెత్తాలి. ఎన్ని నిమిషాల్లో పరుగు పూర్తిచేశారో రికార్డు చేసుకోవాలి. కేవలం ముక్కుతోనే కాకుండా నోటితో కూడా శ్వాస తీసుకోవచ్చు. పరిగెత్తేప్పుడు చేతుల కదలిక చక్కగా ఉండాలి. ఈ కదలిక ఎంత సులభంగా ఉంటే అంత దూరంగా అడుగులు వేయవచ్చు. పరుగెత్తేపుడు కండరాలు బిగించినట్లు కాకుండా వదులుగా ఉంచి పరుగెత్తడం మంచిది.
ఫిజికల్‌ ఎఫిషియంట్‌ టెస్టు (PET):
100 మీటర్ల పరుగు పందెం:
దీని సాధన సమయంలో 100 మీటర్లు మాత్రమే పరుగెత్తకుండా మొదట 30 మీటర్లు, తర్వాత 60 మీటర్లు, 90 మీటర్లు, 120 మీ|| సాధన చేయాలి. ఈవెంట్‌ ప్రారంభ సమయంలో పాదం ముందు భాగంపై నిలబడి విజిల్‌ సౌండ్‌పై ఏకాగ్రత ఉంచి ఆ శబ్దానికి అనుగుణంగా పరుగును ప్రారంభించి లక్ష్యాన్ని పూర్తిచేసే దిశవైపు మాత్రమే చూడాలి. మొదట ప్రారంభించిన వేగాన్ని పెంచుతూ చివరగా 100 మీటర్ల లైను దాటేంతవరకు అదే వేగాన్ని కొనసాగించాలి.
800 మీటర్ల పరుగు
ఇందుకోసం ఎక్కువ దూరం పరుగెత్తడం అభ్యాసం చేయాలి. కనీసం వారానికి ఒకసారి 3000 మీటర్లు నుంచి 4000 మీటర్లవరకు దూరం పరుగెత్తాలి. దీంతోపాటుగా 400 మీ. 800 మీ. 1000 మీ. రోజువారీగా పరుగెత్తడం వల్ల వేగం, Leg movementపెరుగుతుంది. మూలమలుపులు కూడా సాధన చేయాలి.
800 మీటర్ల పరుగులో పాల్గొనేవారు దీర్ఘవృత్తాకార పరిధిలో పరుగెత్తాల్సి ఉంటుంది. అందుకని ప్రారంభం నుంచి లోపలి వైపున్న అంచుల వెంబడి పరుగెత్తుతూ ముందు పరుగెత్తుతున్న అభ్యర్థి కుడి నుంచి Over takeచేస్తూ తిరిగి తను లోపలి అంచుల వెంబడే పరుగు సాగించాలి. పరుగు చివరిదశలో చేతులను వేగంగా కదిలించడం ద్వారా కాళ్లు అడుగులు దూరంగా పడటం ద్వారా తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవచ్చు.
హై జంప్‌
ఇందులో ఎక్కువ ఎత్తు దూకడానికి కాలి కండరాల బలం, శరీరభాగాల సమన్వయ శక్తి తోడ్పడుతుంది. ఈ పోటీలో 1.20 మీటర్ల ఎత్తు దూకాలి. అందుకోసం ముందుగా రన్‌ అప్‌ చేసి ఎత్తుకు ఎగరడాన్నీ, నేలకు సురక్షితంగా చేరడాన్నీ సాధన చేయాలి. రన్‌ అప్‌ ప్రధానంగా ఎత్తు ఎగరడానికి కావలసినంత వేగంతో- చక్కని టేక్‌ అప్‌ పొజిషన్‌ గాలిలో ఎగరడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో బ్యాక్‌జంప్‌, బెల్లీరోల్‌, సిజరింగ్‌, స్టేట్‌జంప్‌లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో ఎడమకాలితో టేకాఫ్‌ తీసుకొని జంప్‌ చేసేటప్పుడు బార్‌ మీద పడుకునే పొజిషన్‌ ఉండాలి. ఇసుకలో మొదట కుడికాలు ల్యాండ్‌ అవుతూ అదే సమయంలో మోచేతి మీదుగా ల్యాండ్‌ అవాలి. సిజరింగ్‌, State Jumpదూకేవారు కనీస వేగంతో టేకాఫ్‌ వేగంతో చేసి బార్‌కు తగలకుండా పైకి ఎగరాలి. ఈ ఈవెంట్‌ కోసం మొదట కింది నుంచి అంటే 50 సెం.మీ. నుంచి క్రమంగా పెంచుతూ దూకుడును పెంచుకోవచ్చు. ఈ విధంగా రోజూ సాధన చేస్తే వీలైనంత ఎత్తు ఎగరగలరు. దూకటం మెరుగవడం కోసం Skipping, Stepups exerciseలు ఉపయోగపడతాయి.
లాంగ్‌ జంప్‌
ఇందులో హ్యాంగ్‌స్త్టెల్‌ ఉపయోగిస్తే సులభంగా అర్హత పొందవచ్చు. ఈ శైలిలో గాలిలో శరీరాన్ని కాళ్ళు, చేతులను వెనక్కి వంచి ఊపుతూ ముందుకు దూసుకెళ్తూ నేలమీదకు ల్యాండ్‌ అయ్యేవరకు కాళ్ళు చేతులను ముందుకు తేవాలి. దీనికోసం కనీసం రన్‌వే 12 మీ|| - 14 మీ|| వరకు తీసుకోవాలి. లాంగ్‌జంప్‌లో వేగంగా రావడమేగాక టేకాఫ్‌ దగ్గర గట్టి కిక్‌ కొట్టాలి. శరీరం టేకాఫ్‌ లెగ్‌కంటే ముందుకు వంగి ఉంటే 20 సెం.మీ. నుండి 25 సెం.మీ. వరకు జంప్‌ పెరుగుతుంది. దీనికోసం 30-50 మీటర్ల స్ప్రింట్‌ సాధన చేయాలి.
షాట్‌పుట్‌
ఇందులో హ్యాంగ్‌స్త్టెల్‌ ఉపయోగిస్తే సులభంగా అర్హత పొందవచ్చు. ఈ శైలిలో గాలిలో శరీరాన్ని కాళ్ళు, చేతులను వెనక్కి వంచి ఊపుతూ ముందుకు దూసుకెళ్తూ నేలమీదకు ల్యాండ్‌ అయ్యేవరకు కాళ్ళు చేతులను ముందుకు తేవాలి. దీనికోసం కనీసం రన్‌వే 12 మీ|| - 14 మీ|| వరకు తీసుకోవాలి. లాంగ్‌జంప్‌లో వేగంగా రావడమేగాక టేకాఫ్‌ దగ్గర గట్టి కిక్‌ కొట్టాలి. శరీరం టేకాఫ్‌ లెగ్‌కంటే ముందుకు వంగి ఉంటే 20 సెం.మీ. నుండి 25 సెం.మీ. వరకు జంప్‌ పెరుగుతుంది. దీనికోసం 30-50 మీటర్ల స్ప్రింట్‌ సాధన చేయాలి.