ఉపాధ్యాయ కొలువులకు కొత్త పరీక్ష!
|
2013లో దాదాపు పాతిక వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి/ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ TEST (Teachers' eligibility and Selection Test) పేరుతో రానుంది. ఏప్రిల్/మేలో నిర్వహించే అవకాశమున్న ఈ నూతన పరీక్ష స్వరూప స్వభావాలు ఎలాంటివి? ఏ అంశాలకు ప్రాధాన్యం ఉండొచ్చు? సంసిద్ధత ఎలా ఉండాలి? నిపుణుల సూచనలు... ఇవిగో!
సిలబస్ అంశాల్లో స్పష్టత తగ్గినా పోటీ తీవ్రత దృష్ట్యా అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ని ప్రారంభించటం మేలు.
జీకే, వర్తమానాంశాలు కొత్త సిలబస్లో ఉంటే ఇబ్బందిపడకుండా ఉండాలంటే రోజూ వార్తాపత్రికలు చదివి దేశ వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
విద్యాహక్కు చట్టం-2009 కింద దేశవ్యాప్తంగా ఏకీకృత ఉపాధ్యాయ అర్హతా పరీక్ష ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలుTET (Teachers' Eligibility Test)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాల్సివచ్చింది. మనరాష్ట్రంలో 2011లో ఒకసారి, 2012లో రెండుసార్లు టెట్ నిర్వహణ పూర్తయింది. అందువల్ల తదుపరి పరీక్ష 2013కి చెందినదై ఉంటుంది. ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులైవుండాలి. అందువల్ల ఒక అర్హతా పరీక్ష అనేది తప్పనిసరి.
అయితే ఆంధ్రప్రదేశ్లాంటి కొన్ని రాష్ట్రాలు DSC పేరుతో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షను నిర్వహించి ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాయి.
|
|
అటువంటి పరిస్థితిలో టెట్, డీఎస్సీ రెండు పరీక్షలనూ ఎదుర్కోవాల్సిరావటం ఉపాధ్యాయ అభ్యర్థులకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రప్రభుత్వం ఈ రెంటినీ కలిపి TESTపేరుతో ఒక నూతన పరీక్షకు తెరలేపింది.
ఈ కొత్త పరీక్షా విధానం, సిలబస్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఇటీవలి డీఎస్సీలో విఫలమైన అభ్యర్థులూ, కొత్త అభ్యర్థులూ ఇప్పటినుంచీ సమాయత్తమైతేనే వాటిని ఎదుర్కోగలమనే దృష్టితో ఉన్నారు.
సిలబస్ ఏం ఉండొచ్చు?
విద్యాహక్కు చట్టం-2009, ప్రపంచీకరణ అవసరాల నేపథ్యంలో గతంలో జరిగిన TETపరీక్షల సిలబస్కి అధిక ప్రాధాన్యం ఉండవచ్చు. టెట్, డీఎస్సీలను కలుపుతున్న నేపథ్యంలో కంటెంట్, మెథడాలజీలు తప్పనిసరి అంశాలుగా ఉంటాయి. అయితే టెట్లో ఇప్పటివరకూ ఉన్న సైకాలజీ, జనరల్ ఇంగ్లిష్, అలాగే డీఎస్సీలో ఇప్పటివరకూ ఉన్న జీకే, విద్యాదృక్పథాలు- వీటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. ఎలాగూ టెట్ ప్రాధాన్యం 20 శాతం మార్కులు ఉండకపోవచ్చు కాబట్టి 4 అంశాలనూ యథాతథంగా ఉంచవచ్చా అనేది స్పష్టం కాలేదు.
ఈ సందర్భంగా వివిధ సబ్జెక్టులపై విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నఅభిప్రాయాలు:

జీకే, వర్తమాన అంశాలను పరీక్ష కోసమే అన్నట్లు అభ్యర్థులు బట్టీ పడుతున్నారు. ఆచరణలో ఈ అంశం ఉపాధ్యాయులకు పెద్దగా ఉపయోగపడటం లేదు.

మోడల్, సక్సెస్ పాఠశాలల నేపథ్యం, సాంకేతిక కోర్సుల అవసరం దృష్ట్యా జనరల్ ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉండాలి.

విద్యార్థి అధ్యయనానికి సైకాలజీ ఉండవలసిందే.

ఉపాధ్యాయుని దృక్పథాన్ని తీర్చిదిద్దేది కాబట్టి 'విద్యాదృక్పథాలు'నుకొనసాగించవచ్చు.
4 అంశాలనూ కొనసాగిస్తే Jack of all trades and master of none' సామెత రుజువయ్యే ప్రమాదం ఉంది. టెట్లో మాదిరిగా ఎస్జీటీలకు 9,10 తరగతుల సిలబస్; స్కూల్ అసిస్టెంట్లకు ఇంటర్ సిలబస్ ఉంచుతారా లేదా అన్నది మరొక విషయం.
సిలబస్ అంశాల్లో స్పష్టత తగ్గినా పోటీ తీవ్రత దృష్ట్యా అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ని ప్రారంభించటం మేలు.
ఎస్జీటీ అభ్యర్థులు

1 నుంచి 8 తరగతుల సిలబస్ని క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా 6,7.8 తరగతుల్లోని గణితం, భౌతికశాస్త్రం అంశాల విషయంలో ఆర్ట్స్ అభ్యర్థులు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు.

అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వారు ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయాలి. అరమార్కుతో కూడా విజయావకాశాలు దూరమయ్యే పరిస్థితి ఉన్నందువల్ల ఇంగ్లిష్లో సరైన పట్టు సాధించటం అవసరం.

మాతృభాష అయినా తెలుగులో అభ్యర్థులు ఆశించినస్థాయిలో ప్రతిభను చూపలేకపోతున్నారు. ఈ లోపాన్ని సవరించుకోవటానికి ఇదే సరైన సమయం.
స్కూల్ అసిస్టెంట్లు /భాషాపండితులు
6-10 తరగతుల సిలబస్పై పట్టు కోసం ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా గణితం/ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు గత అనుభవాలను బట్టి ప్రశ్నల క్లిష్టతను ఎదుర్కొనేలా తయారయ్యేందుకు అనువైన సమయమిదే. ఆర్ట్స్ అభ్యర్థులు జాగ్రఫీ, చరిత్రలాంటి పాఠ్యాంశాల్లో సిలబస్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఈ సమయాన్ని అందుకోసం వెచ్చించాలి.
సూచన: మెథడాలజీ విషయంలో ఎస్జీటీ/ ఎస్ఏలు నామమాత్రంగానే స్కోరు సాధిస్తున్నారు. అందువల్ల మంచి ర్యాంకు సాధించాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు సమయం కేటాయించుకుని మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఈ దశలో సిలబస్లోని పాఠ్యాంశాలు కొన్నిటిని కాకుండా అన్నిటినీ చదవాలి. కీలకమైన పాఠాలనుంచే కాకుండా ఇతర పాఠాలనుంచి కూడా ఐదారు ప్రశ్నలు అడుగుతున్నారు.
పి.ఇ.టి.లు
దాదాపు 4,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దాదాపుగా పీఈటీ అభ్యర్థులు అందరికీ ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశం.
నోటిఫికేషన్ వచ్చేముందుగా ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, మెటీరియల్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అనాటమీ, ఫిజియాలజీ లాంటి అంశాలకు తగిన సమయం వెచ్చించేందుకు ఇది తరుణం. ముఖ్యంగా పి.ఇ.టి. అభ్యర్థుల్లో థియరీ అంశాల్లో ఆశించిన స్థాయి ఉండటం లేదు. అందుకని ఈ సమయాన్ని అందుకు వినియోగిస్తే పోటీలో ముందుండవచ్చు.
ఇతర అంశాలు

సైకాలజీ లాంటి అంశాలకు రాబోయే నూతన విధానంలో ప్రాధాన్యం ఉండొచ్చు. అందువల్ల కంటెంట్, మెథడాలజీలపై పట్టు సాధించి ఉంటే సైకాలజీకి సమయం కేటాయించటానికి వీలవుతుంది.

జీకే, వర్తమానాంశాలు కొత్త సిలబస్లో ఉంటే ఇబ్బందిపడకుండా ఉండాలంటే రోజూ వార్తాపత్రికలు చదివి దేశ వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవాలి.

ఇప్పటికే డీఎస్సీ రాసిన అభ్యర్థులు విజయం సాధించలేకపోయివుంటే లోపం ఎక్కడుందో గమనించండి. ముఖ్యంగా మెథడాలజీ లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. 'నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం' లాంటి ధోరణి వద్దు. ఇప్పటినుంచే మళ్ళీ సన్నద్ధత మొదలుపెట్టండి.

కోచింగ్ సంస్థల, మార్కెట్లో దొరికే మెటీరియల్లో అనవసర సమాచారం ఎక్కువుంటుంది. అందుకని సైకాలజీ, మెథడాలజీ లాంటివాటికి తెలుగు అకాడమీ పుస్తకాలు సరిగా ప్రిపేరవ్వాలి. కంటెంట్ కోసం పాఠశాలస్థాయి పాఠ్యపుస్తకాలు చాలు. గతంలో ఈ విధంగా సిద్ధం కాకపోతే ఈ సమయం అందుకు అనుకూలమని కార్యాచరణ మొదలుపెట్టాలి.

ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా అర్హత పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్ లేదు కాబట్టి ఏం చేయాలనే సందేహం పెట్టుకోవద్దు. TESTద్వారా ఆ అవకాశం కల్పించవచ్చు. అందువల్ల మీ పాఠశాలలో మీరు కొనసాగాలంటే తప్పనిసరిగా ప్రిపరేషన్ని ప్రారంభించాలి.
వేటిపై దృష్టి సారించాలి?
టెట్, డీఎస్సీలలో దాదాపు ఒకే సిలబస్ ఉండటం, టెట్లో అభ్యసించిన విషయాలనే చాలావరకూ డీఎస్సీలో మళ్ళీ చదవాల్సిరావటంతో అభ్యర్థుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పరీక్షలకు బదులు ఒకే TESTనిర్వహించనుండటం ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు శుభపరిణామమే. కాలం, శ్రమ, ఖర్చు తగ్గుతాయి. కాలయాపన లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
TEST లో ఎక్కువభాగం టెట్ సిలబస్ ఉండటానికి అవకాశముంది.
 పెడగాజి (మెథడాలజీల)పై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఒక్క బోధనాపద్ధతుల సిలబస్ను ఆమూలాగ్రం విశ్లేషణాత్మకంగా అభ్యసిస్తే అది మిగతా బోధనాపద్ధతుల అభ్యాసంలో, సులభంగా నేర్చుకోవడంలో తోడ్పడుతుంది.
 కంటెంట్పై శ్రద్ధ వహించాలి. దీన్ని అభ్యసించేటపుడు మెథడాలజీని కూడా అన్వయించుకుంటే మంచి ఫలితాలకు వీలుంటుంది.
 సైకాలజీ, మెథడాలజీలను పాఠశాల స్థాయిలో చదవలేదు కాబట్టి వీటిపై శ్రద్ధపెట్టాలి.
|
|

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని తరగతి గది విషయాలకు అన్వయించుకుని సన్నద్ధత కొనసాగించాలి. ఈ సైకాలజీ కష్టమనే భావన నుంచి అభ్యర్థులు బయటపడటానికి అర్థం చేసుకుంటూ చాలాసార్లు అభ్యసించటమే మార్గం.

విద్యారంగంలోని దృక్పథాలు, వర్తమాన అంశాలపై పట్టు సాధించటం అవసరం.

ఎస్జీటీకి సిద్ధమయ్యేవారు తెలుగు, ఆంగ్ల వ్యాకరణాంశాలను ఇప్పటినుంచే టెన్త్ స్థాయివరకూ నేర్చుకోవాలి.
మంచి మార్కులు పొందాలంటే...

ఇప్పటికే టెట్, డీఎస్సీ రాసినవారు ఏ సబ్జెక్టులో ఇంకా సాధన అవసరమనిపిస్తుందో దానిపై దృష్టిపెట్టాలి.

ఇటీవలే డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైనవారు ఇంతవరకూ చదివిన విషయాలను ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లోకి మార్చుకుని అభ్యసించాలి.

నిర్దేశిత సిలబస్ ప్రకారం ప్రామాణిక పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి.

కేవలం జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాసే స్థితిలో ఉండకూడదు. అవగాహన, అనుప్రయుక్త, విశ్లేషణ, తార్కిక పద్ధతిలోని ప్రశ్నలకు సమాధానం రాసేలా తయారవ్వాలి.
No comments:
Post a Comment